అఖండ దైవిక వస్తువులలో శంఖం – మీనాక్షి

భారతీయ సంస్కృతిలో ‘శంఖం’కు ప్రత్యేక స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం.

క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మధన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి.

శంఖం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది. దక్షిణావర్త శంఖం ఎంతో శ్రేష్ఠమైంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో ‘పాంచజన్యం’ అనే శంఖాన్ని పూరించాడు. అదే విధంగా అర్జునుడి శంఖాన్ని ‘దేవదత్తం’గానూ, భీముని శంఖం ‘పౌండ్రకం’ అనీ, యుధిష్ఠరుని శంఖాన్ని ‘అనంత విజయమ’నీ, నకులుని శంఖాన్ని ‘సుఘోష’ నామంతో, సహదేవుని శంఖాన్ని ‘మణిపుష్ప’ అన్న పేర్లతో పిలుస్తారని మహాభారతకథ చెబుతుంది.

నిజానికి శంఖం జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు. ‘శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు !’ అనే నానుడి మనకు తెలిసినదే. నవ నిధులు, అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. పూజ,ఆరాధన, యజ్ఞాలు, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక! ధార్మిక ఉత్సవాలు, యజ్ఞాలు, శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు. శంఖాన్ని పూజిస్తారు.
సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది. అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి.

దీనిని పూరించేటప్పుడు వెలువడే తరంగాలు మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని, ఆ ధ్వనిని వినడంవలన గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయంటారు.

  • మీనాక్షి మధురవాణి

Leave a Reply

%d