ధాన్యం తూకం వేయడంలో ఆలస్యం, కాంటా పెట్టిన వడ్లు రైస్మిల్లులకు తరలించేందుకు లారీలు రాకపోవడాన్నినిరసిస్తూ శుక్రవారం పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగారు. మండుతున్న ఎండను లెక్కచేయకుండా రోడ్ల మీద రాస్తారోకోలు చేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోనూ రైతులు రోడ్డెక్కారు. ధ్యాన్నాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి వద్ద రైతులు రాస్తారోకో చేశారు. ఎర్రటి ఎండలో రోడ్డుపై బైఠాయించారు. వడ్ల సంచులను తగులబెట్టారు. ఇదే మండలం మక్కా రాజుపేట వద్ద కూడా లారీలను పంపించాలని చేగుంట, గజ్వేల్ రోడ్డుమీద రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వం చెప్పినా తడిసిన ధాన్యాన్ని కొనడం లేదని చిన్నశంకరంపేట మండల రైతులు చేగుంట, మెదక్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. వడ్ల సంచులకు నిప్పంటించి నిరసన తెలిపారు. తూప్రాన్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు తహసీల్దార్ ఆఫీస్ వద్దకు వచ్చి మెయిన్ రోడ్డుపై ఆందోళన చేశారు. ధాన్యాన్ని తగలబెట్టి నిరసన తెలిపారు. 15 రోజులుగా లారీలు పంపాలని అడుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. తరుగు పేరిట మిల్లర్లు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
For More News Click: https://eenadunews.co.in/
మెదక్లో
పది రోజుల నుంచి లారీలు రావడం లేదని మెదక్ జిల్లా నర్సాపూర్లో రైతులు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. మెదక్, హైదరాబాద్ నేషనల్ హైవే మీద వడ్ల ట్రాక్టర్లు నిలిపి, వడ్లకు నిప్పు పెట్టారు. డప్పులు కొడుతూ నిరసన తెలిపారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయిపల్లి గోపి, అసెంబ్లీ కన్వీనర్ మల్లేశ్ గౌడ్ మద్దతు తెలిపారు. మాయిశ్చర్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, తూకంలో మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అక్కడకు వచ్చిన తహసీల్దార్, పోలీసులకు.. రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్ జామ్ కావడంతో నాయకులను, రైతులను పక్కకు గుంజేశారు.