కుటుంబ పెద్ద మరణించి శోకసంద్రంలో ఉన్నా… ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఇతరుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. అంతేకాకుండా అవయవదానంతో సమాజానికి మార్గదర్శకంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే… నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన నడికుడి రవికుమార్ (36) స్థానికంగా సిమెంట్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రక్తపోటు (బిపి) ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకవెళ్లారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతనిని రక్షించడానికి వైద్యులు నాలుగు రోజుల పాటుఎంతో శ్రమించారు. కానీ దురుదృష్టవశాస్తూ గురువారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయ్యారు.
ఆ తర్వాత అవయవదానంపై కిమ్స్ ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయ కర్తలు, మృతుడి కుటుంబ సభ్యులకు, బంధువులకు, అవగాహన కల్పించారు. అనంతరం భార్య, కుమారుల అంగీకారంతో ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్ దానం చేశారు. చనిపోతూ మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య కవిత, కుమారులు చరణ్ తేజ్ (11), వరుణ్ తేజ్ (9) ఉన్నారు. జీవన్ధాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అవసరం ఉన్నచోటికి అవయవాలను తరలించారని జీవన్ దాన్ కమిటీ సభ్యులు తెలిపారు.
ఆయన ఆవయవదానంతో ఐదుమందికి జీవితాన్నిచ్చాడు
