తెలంగాణ ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై కేంద్రానికి నేరుగా రిపోర్టు పంపారు. గణతంత్ర దినోత్సవాల విషయంలో మూడేళ్ళుగా జరుగుతున్న వేడుకల తీరును ఆమె ఇందులో ప్రస్తావించారు. ఈ ఉత్సవాలను నిర్వహించడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదని వ్యాఖ్యానించిన ఆమె.. ఇందుకోసం కరోనా నిబంధనలను సాకుగా చూపుతున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశించినా గణతంత్ర దినోత్సవాలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
కరోనా రూల్స్ ..సీఎం సభకు వర్తించవా అని ఆమె ప్రశ్నించారు. ఆ సభకు 5 లక్షలమంది వచ్చేలా ఏర్పాట్లు చేశారని ఆమె పేర్కొన్నారు, కలెక్టర్, ఎస్పీ సహా అధికారులపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని, కానీ ఎవరో ఆదేశిస్తే వారిని శిక్షించడం సరికాదన్నారు. నా వల్ల వారికి బ్లాక్ మార్క్ రావడం నాకిష్టం లేదు.. నిజానికి ప్రోటోకాల్ విషయాలకు సంబంధించి కేంద్రం సూచించిన మార్గదర్శకాలను ఈ ప్రభుత్వం పాటించడం లేదు అని తమిళసై ఆరోపించారు. రిపబ్లిక్ దినోత్సవ వేడుకల నిర్వహణపై రెండు నెలల క్రితమే తాను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని ఆమె తెలిపారు.