మెదక్ జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి, సోమవారం పొద్దున జిల్లాలోని చాలా చోట్ల భారీగా వర్షం పడింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున వడ్ల సంచులు తడిసిపోయాయి. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలిపోయాయి. రెండు వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. పలు చోట్ల ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. రేగోడ్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లన్నీ తడిసిపోయాయి. వడ్ల కుప్పల మీద టార్పాలిన్ కవర్ లు కప్పినప్పటికీ వర్షపు నీళ్లు లోపలక వెళ్లడంతో వడ్లు తడిసిపోయాయి. శివ్వంపేట మండలం తాళ్లపల్లిగడ్డ తండా, చిన్నగొట్టి ముక్కుల, శివ్వంపేటలో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యంతోపాటు, శివ్వంపేటలోని రైస్ మిల్ వద్ద ట్రాక్టర్లలో ఉన్న ధాన్యం కూడా తడిసిపోయింది. కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్, పోతం శెట్ పల్లిలో, టేక్మాల్, హవేలి ఘనపూర్, చిలప్చెడ్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో తూకంవేసి సంచుల్లో నింపిపెట్టిన ధాన్యం కూడా వర్షానికి తడిసింది.
మెదక్ జిల్లాలో వాన బీభత్సం భారీగా పంట నష్టం
