ఇక సెలవు…

అలనాటి సినీనటి జమున (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. శుక్రవారం మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి.

ఇదీ ప్రస్థానం:
1936 ఆగస్టు 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తండ్రి పేరు నిప్పణి శ్రీనివాసరావు, తల్లి కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు జానాభాయి. జ్యోతిషుల సూచనతో ఆమె తల్లిదండ్రులు జమునగా పేరు మార్చారు. గుంటూరులోని దుగ్గిరాల బాలికల పాఠశాలలో ఆమె చదువుకున్నారు. తల్లి దగ్గరే గాత్ర సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. ‘ఖిల్జీరాజుపతనం’ నాటకంలోని ఓ పాత్రకు సీనియర్‌ నటుడు జగ్గయ్య ఆమెను ఎంపిక చేశారు. ‘మా భూమి’ నాటకం చూసి డాక్టర్‌ గరికిపాటి రాజారావు ఆమెకు మొదటి సినీ అవకాశాన్నిచ్చారు. అలా జమున మొదటిసారి 1952లో విడుదలైన ‘పుట్టిల్లు’ సినిమా కోసం పనిచేశారు.

సత్యభామ పాత్రకు:
గడుసైన పాత్రలు, ముఖ్యంగా సత్యభామ పాత్రకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆమె నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో కొన్ని వందల చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీ రంగారావు, కృష్ణ సహా పలువురు దిగ్గజ నటులతో ఆమె నటించి సినీ ప్రియులను అలరించారు. నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ జమున రాణించారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యారు.

Leave a Reply

%d