ఇండియన్ పల్ప్ అండ్ పేపర్ టెక్నికల్ అసోసియేషన్ (ఐపీపీటీఏ-ఇప్టా) తన 58వ వార్షిక సర్వసభ్య సమావేశం, సెమినార్ను మార్చి 17, 18 తేదీలలో హైదరాబాద్లో నిర్వహిస్తోంది. ఈ సెమినార్ ప్రధాన ఇతివృత్తం.. “హరిత ఉత్పత్తి దిశగా కాగితం పరిశ్రమను సిద్ధం చేయడం”.
ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరయ్యారు. ఆయన ఐపీపీటీఏ అధికారిక అంతర్జాతీయ పత్రికను విడుదల చేసి మాట్లాడారు. “వాతావరణ మార్పుల ప్రభావం అన్నిచోట్లా కనపడుతోంది. మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, కాపాడుకోవడానికి ప్రకృతి రకరకాలుగా సంకేతాలు ఇస్తోంది. భూమాత ఇంతవరకు జరిగిన నష్టాన్ని అపారమైన సహనంతో సహిస్తోంది. కానీ ఇక తట్టుకోలేక ఇప్పుడు తన కోపాన్ని ప్రదర్శిస్తోంది” అన్నారు.