ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని, అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఉగ్రవాదిని కాదని.. ఎటువంటి దందాలు చేయలేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో అభిమానులు, అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. తన జీవితం ఉన్నదే తనను నమ్ముకున్నవారికోసమని, తన భద్రతా సిబ్బందిని తగ్గించినా, తొలగించినా బాధపడలేదన్నారు. ఇప్పుడున్న ఇద్దరిని కూడా తీసేసిన ఏమీఅవదని, తాను రాజకీయాల్లోకి రాకముందే కాంట్రాక్టర్ నని, కేసీఆర్ పిలుపు మేరకే భారత రాష్ట్ర సమితిలో చేరినట్లు వెల్లడించారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో పార్టీలో తాను ఎంత గౌరవం పొందానో మీ అందరికీ తెలుసని, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేయబోతున్నట్లు తెలిపారు. తనకోసం లక్షల మంది అభిమానులు, సైనికులు ఉన్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామం తిరుగుతానన్నారు. ప్రజలందరినీ కలుస్తానని, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలను మాత్రం వదిలేది లేదని, తనను ఇబ్బంది పెట్టినా ప్రజల నుంచి మాత్రం వేరేచేయలేరన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు విడమరిచి చెబుతానని పొంగులేటి అన్నారు.
పొంగులేటి వ్యాఖ్యలు దేనికి సంకేతం
