ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కాంలో ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేసిన సుఖేష్ చంద్రశేఖర్.. మరోసారి సంచనల ఆరోపణలతో లేఖ విడుదల చేశాడు. మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను హెచ్చరిస్తూ రెండు పేజీల లేఖను విడుదల చేశాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనతోనే తాను హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ చెందిన నేతకు రూ.15 కోట్లు ఇచ్చానని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా బీఆర్ఎస్ నేతతో జరిగిన వాట్సాప్ చాట్ను కూడా లేఖలో ప్రస్తావించాడు. తనతో చాట్ చేసిన వ్యక్తి సౌత్ గ్రూప్లోని బీఆర్ఎస్ లీడరేనని లేఖలో తేల్చి చెప్పాడు. బీఆర్ఎస్ ప్రాంగణంలో 6069 నెంబర్ గల రేంజ్ రోవర్ పార్క్ చేసి ఉందని తెలిపిన సుఖేష్.. ఆ కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందని కూడా పేర్కొన్నాడు.
అయితే.. ఇంతకముందు విడుదల చేసిన లేఖలో “ఏపీ” అనే కోడ్ వర్డ్ను వాడిన సుఖేష్.. దాన్ని ఈ లేఖలో రివీల్ చేశాడు. ముందు నుంచి అనుమానిస్తున్నట్టుగానే ఏపీ అంటే అరుణ్ పిళ్లై అని సుఖేష్ స్పష్టం చేశాడు. అయితే.. తాను చేస్తున్న వ్యాఖ్యల పట్ల అవసరమైతే తాను నార్కో టెస్ట్కు కూడా సిద్ధమని సుఖేష్ ప్రకటించాడు. ఇది జస్ట్ టీజరేనని.. అసలైన బ్లాక్ బస్టర్ ముందు ముందు రిలీజ్ చేస్తానంటూ కేజ్రీవాల్ను సుఖేష్ చంద్రశేఖర్ హెచ్చరించాడు.
ఇదిలా ఉంటే.. త్వరలోనే కేజ్రీవాల్ తానతో చేసిన వాట్సాప్ చాటింగ్ను బయటపెడతానని తెలిపాడు సుఖేష్. ఈ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ తనతో చేసిన 700 పేజీల వాట్సాప్ చాట్, టెలిగ్రామ్ చాట్లు తన దగ్గరున్నట్టు చెప్తూ వస్తున్నాడు సుఖేష్.