ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేయడంతో ఆమె గెలిచారు. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరని ఆరాతీసిన అధిష్ఠానం కనిపెట్టేసింది. ఇద్దరు ఎమ్మెల్యేల గురించి వైసీపీ పెద్దలు సమాలోచనలు చేసి చివరికి పార్టీ నుంచి సస్పెన్షన్ చేసింది. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై వేటుపడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు గాను వేటు వేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారికంగా ప్రకటన చేశారు.
కోట్లు పెట్టి కొన్నారని ఆరోపణలు..!
క్రాస్ ఓటింగ్పై అంతర్గతంగా విచారణ చేశామన్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారని ప్రాథమిక దర్యాప్తు తర్వాతే ఈ వేటు నిర్ణయం తీసుకున్నట్లు సజ్జల స్పష్టం చేశారు.