తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ఈ సాయంత్రం ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ నెలలోనే గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థుల ఆందోళనలతో ప్రభుత్వం వీటిని నవంబరు మాసానికి వాయిదా వేస్తున్నట్టు శనివారం ప్రకటించిన విషయం విధితమే. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ http://www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు.
తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. ఆగస్టు నెలలో గురుకుల టీచర్ పరీక్షలు, స్టాఫ్నర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్, ఎస్ఎస్సీ, ఐబీపీఎస్ వంటి పలు పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాల అభ్యర్థులు, యువజన సంఘాలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శితో సమావేశమై అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి, పరిస్థితులను సీఎంకు నివేదించారు. దీంతో తాజాగా కొత్త షెడ్యూల్ను ఖరారు చేసింది. తెలంగాణలో మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాలకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే…!!