తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. రాష్ట్రాన్ని సాధించికుని, బంగారం తెలంగాణగా మార్చుకున్నాం ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. కేసీఆర్ వదిలి పెట్టిన టీఆర్ఎస్ను అస్త్రంగా మార్చుకోవడానికి ఆయన ప్రత్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభం కానుంది.
ఇప్పటికే డజనుకు పైగా పార్టీలున్నాయి.. కొత్తగా వస్తే చెప్పుకోవాల్సింది ఏముందిలే అనుకుంటున్నారా.. కానీ చాలామంది.. ఈ కొత్త పార్టీ వెనక ఎవరూ ఊహించని కహానీ ఉంది.. దాని వెనక పెద్ద కసరత్తు జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ తిరుగులేనిస్థానంలో ఉంది. ప్రత్యామ్నాయం మేమే అంటున్న కాంగ్రెస్ అంతర్గత లొల్లితో సతమతమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంతా మేమే అంటున్న బీజేపీ కూడా కేడర్ లేక ఇబ్బందులు పడుతోంది. మిగిలిన పార్టీల్లో పెద్దగా లీడర్లు లేరు.. ప్రభావితం చేసేంత శక్తి సామర్థ్యాలు లేవు. అంటే అధికారం సొంతం కాకపోయినా కనీసం 30 సీట్లలో పోటీచేసి సగమైన గెలిచే ఆర్థిక, అంగబలం ఉన్న పార్టీలకు స్కోప్ ఉందని కొందరు లీడర్లు నమ్ముతున్నారు. అలా నమ్ముతున్న వాళ్లే ఇప్పుడు రంగంలో దిగారు.
వివిధ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న పెద్ద నాయకులు..
మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమంలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని రాజకీయంగా ఇప్పటికీ అవకాశాలు అందిపుచ్చుకోలేని నాయకులు అంతా ఒక్కటై పార్టీ పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన నాయకులున్నారు. ఇక వీరికి తోడుగా నల్గొండ బడా ఫ్యామిలీ కూడా తోడైంది. ఉద్యమకారులు కలిసివస్తామని చెప్పడంతో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మనం చెప్పుకుంటున్న నాయకులకు మంచి పలుకుబడి ఉంది.. రాజకీయ నేపథ్యం, అనుభవం పుష్కళంగా ఉంది. వీటికి తోడు పార్టీ ఆలోచన చేస్తున్న వారంతా కూడా ఆర్థికంగా శక్తిమంతులు కూడాను. అన్నింటికి మించి కేసీఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొంతంగా అధికారంలోకి రాకపోయినా కింగ్ మేకర్ కావాలన్నది వారి లక్ష్యం. కాలం కలిసొస్తే కర్నాటకలో జేడీఎస్కు అధికారం చిక్కినట్టు అవకాశమూ దక్కవచ్చన్నది వారి వ్యూహం.