ఉద్యోగానికి బయలు దేరాల్సిన రోజే శవమై కనిపించింది. భర్త ఆత్మహత్య అని చెబుతుంటే.. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం ఇది ముమ్మాటికి హత్యేనని అంటున్నారు. ఇంతకు ఏమైందంటే.. ఉత్తరప్రదేశ్లోని బారు సాగర్కు చెందిన రోష్ని ప్రజాపతికి 2021లో ఝాన్సీలోని నవాబాద్లోని పిచోర్ వాసి కాళీ చరణ్తో వివాహం అయ్యింది. కాళీ చరణ్ బ్యాంకులో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రోష్ని కూడా బీటీఎస్ పూర్తి చేసింది. అయితే పెళ్లైయ్యాక ఉద్యోగం చేయాలనుకుంది. కానీ భర్త, అత్తమామలు అందుకు అంగీకరించలేదు. తాను ఉద్యోగం చేయడంపై తరచూ భర్తను అడగటంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కాళీ చరణ్ ఉద్యోగం పోయింది. అంతలో రోష్నికి ప్రైవేట్ టీచరుగా ఉద్యోగం వచ్చింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా నిరాకరించాడు. అయితే భర్త మాట పట్టించుకోలేదు.
తన ఆదాయంతో కుటుంబానికి కొంత మేలు చేసిందాన్ని అవుతాననే ఆలోచన చేసి ఉద్యోగానికి వెళదామని భావించింది. కానీ ఈ విషయంపై భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. అయితే భర్త చెబుతున్న దాని ప్రకారం ఉద్యోగానికి బయలు దేరగా.. గొడవ జరిగిందని, ఆ తర్వాత రూములోకి వెళ్లి తలుపు వేసుకుని బయటకు రాలేదని, ఆపై చూడగా.. ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయిందని చెప్పాడు. అయితే రోష్ని కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని, ఆమెను చంపి ఆత్మహత్యగా కాళీ చరణ్ కుటుంబం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆమె అందంగా ఉండటంతో ఎప్పుడూ అనుమానించేవాడని, భార్య బయటకు వెళితే.. మరొకరితో సంబంధం పెట్టుకుంటుందన్న భావంతో భార్యను ఉద్యోగానికి పంపించేవాడు కాదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఒంటిపై గాయాలున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.